Saturday, June 25, 2011

సేంద్రియ మరియు రసాయన ఎరువులను సమర్దవంతం గా ఉపయోగించడానికి సూచనలు :

సేంద్రియ మరియు రసాయన ఎరువులను సమర్ధ వంతం గా ఉపయోగించ డానికి సూచనలు:
ఎరువుల సామర్ధ్యం పెంచ డానికి, ప్రతికిలో పోషక పదార్ధం నుండి గరిష్ట వ్యవసాయోత్పత్తి సాధించడానికి దిగువ తెలిపిన చర్యలు, సాగు పద్ధతులు దోహదం చేస్తాయి.
  1. ప్రాంతానికి అనువైనవి, వేసిన ఎరువులకు అత్యధికమైన ప్రతి ఫలం ఇవ్వగలిగే పంటలు, వంగడాలను ఎంపిక చేయాలి.
  2. దేశవాళీ రకాల కంటే అధిక దిగుబడి ఇచ్చే రకాలు రసాయనిక ఎరువులు వేయక పోయినా ఎక్కువ దిగుబడి ఇస్తాయి. రసాయన ఎరువులు చాలినంత వేసినప్పుడు, తక్కువ వేసినపుడు కూడా ప్రతి కిలో పోషక పదార్ధానికి ఎక్కువ ప్రతి ఫలం ఇస్తాయి. అందుచేత అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు పండించాలి.
  3. ఎరువుల నుండి పూర్తి ప్రతి ఫలం రావడానికి, ఆ ప్రాంతానికి తగిన సమయం లో విత్తడం లేక నాటు వేయడం చేయాలి.
  4. మొక్కల మధ్య దూరం, రకాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి మార్చు కోవాలి. ఉదా: ఖరీఫ్ లో వరి వరుసల మధ్య 15  సెం.మీ వరుసలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండేటట్లు (చదరపు మీటరుకు 70 కుదుళ్ళు) నాటు కోవాలి. రబీ లో 10 సెం. మీ x 10 సెం.మీ ఎడం గా (చదరపు మీటరు కు 100 కుదుళ్ళు) ఉండేటట్లు నాటాలి.
  5. ఏ పంట పండించినా, ఏ నెలలోనైనా, ఏ కాలం లో నైనా సేంద్రియ ఎరువు పొలానికి వేస్తె మినిరలైజేషన్ వల్ల అత్యధిక మోతాదుల్లో పోషకాలను తీసుకోవడమే కాకుండా అన్ని పోషకాలు సమతూకం లో లభిస్తాయి.
  6. అవసరానికి తగినంత నీటినే పంటకు పెట్టాలి. అధికంగా పెట్టినచో నత్రజని, పొటాష్ లు నేల క్రింద పొరలలోనికి కొట్టుకొని పోతాయి. పొలంలో నీరు అధికం గా వున్నానత్రజని గణనీయం గా వాయు రూపం లో పోతుంది. అందుచేత రసాయన ఎరువులు వేసేటప్పుడు, వేసిన తరువాత కొద్ది సేపటి వరకు ఎక్కువ నీరు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ విషయం ముఖ్యం గా యూరియా కు వర్తిస్తుంది. బురద పదును లో మాత్రమే యూరియా ను వెయ్యాలి. యూరియా వేసిన 24-48 గంటల తరువాత మళ్ళీ నీరు పెట్టాలి.
  7. భాస్వరపు ఎరువు వలన ప్రతి ఫలం ఖరీఫ్ లో కంటే రబీ లో ఎక్కువ గా ఉంటుంది. భూసార పరీక్ష ను అనుసరించి రబీలో భాస్వరపు ఎరువును వేయుట మంచిది.
  8. భూసార పరీక్ష తప్పక చేసుకోవాలి. దీనివల్ల పోషకాల లభ్యత ఎంత వున్నదీ తెలుస్తుంది. వాటిని ఆధారం గా చేసుకొని వేసుకోవలసిన రసాయన ఎరువుల మోతాదు లను నిర్ణయించు కోవాలి. ఒక పొలం లో ఒక సంవత్సరం వేసే పంట లు అన్నిటినీ దృష్టి లో పెట్టుకొని ఎరువులు సిఫారసు చేయాలి. అంటే గాని ఒక్కొక్క పంటకు వేరు వేరు గా ఎరువుల మోతాదు నిర్ణయించ కూడదు.
  9. మొత్తం భాస్వరాన్ని విత్తనం వేయక ముందు లేక నాట్లు వేయకముందు ఆఖరి దుక్కి లో వేసుకోవాలి. తేలిక నేలల లోనూ, పొటాషియం లోపం ఎక్కువగా వుండే నేలల్లోనూ, ఇసుక నేలల్లోనూ, చౌడు భూముల్లోనూ, వర్షపాతం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లోనూ, దీర్ఘకాలిక పంటలకు పొటాషియం రెండు దఫాలు గా వేయడం మంచిది. నత్రజనిని  పంట కాలం లో వివిధ పెరుగుదల దశలలో పైరు అవసరాలు, నేలలో తేమను దృష్టి లో పెట్టుకొని 2-3 దఫాలు గా వేయాలి.
  10. భాస్వరపు ఎరువులను విత్తనం వరుసకు 2 ½ - 5 సెం.మీ క్రింద విత్తనాలకు 5-6 సెం. మీ దూరం గా పడే టట్లు వేయాలి. పొటాషియం ను భాస్వరపు ఎరువుతో పాటు ప్లేస్ మెంట్ పధ్ధతి లో వేయవచ్చును. రసాయన ఎరువులు తేమ ఉండే ప్రదేశం లో వేయాలి.
  11. యూరియా ఒక భాగం, తడి మట్టి 5-10 భాగాలు బాగా కలిపి 25 గంటల సేపు నిలువ చేసిన తర్వాత పైరు మీద చల్లితే నత్రజని నష్టం తగ్గుతుంది.
  12. నేల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనపుడు రసాయన ఎరువులను అవసరమైతే క్రిమి సంహారక మందులతో  కలిపి ఆకుల మీద స్ప్రే చేసినట్లయితే ఎరువులు సమ్మర్ద వంతం గా వినియోగ పడతాయి.
  13. ఈ మధ్య తుత్తు నాగం (జింకు) లోపం చాలా చోట్ల కనబడుతున్నది. లోపం కనిపించిన చోట్ల విత్తనం వేయకముందు లేక నాట్లు వేయక ముందు హెక్టేరుకు 10 నుండి 50 కిలోల జింకు సల్ఫేట్ ఆఖరి దుక్కి లో వేయాలి.
  14. ఆమ్ల నేలలు, ఉప్పు నేలలు, చౌడు నేలలను బాగు చేయడానికి రసాయన ఎరువులు వేయకముందు, ఆమ్ల నేలలకు సున్నం, చౌడు నేలలకు జిప్సం వేయాలి.
  15. విత్తిన / నాటిన 10 -15 రోజులలో కలుపును తీసివేసి మొదటి దఫా పై పాటు గా రసాయన ఎరువులు వేసుకోవాలి.
  16. రసాయన ఎరువులు ముఖ్యం గా నత్రజని ని అధిక మోతాదులలో వేయరాదు. పోషకాలన్నీ సమతుల్యత లో ఉండేటట్లు చూసుకోవాలి.
  17. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల పైనే రైతులు ధ్యాస పెట్టుతున్నారు కాని సూక్ష్మ పోషకాలపై కూడా వారు దృష్టి పెట్టాలి.
  18. భాస్వర ఎరువులతో జింకు ఎరువులను కలిపి వేయరాదు.

నిదానం గా నత్రజని విడుదల చేయు రసాయన ఎరువులు:
నత్రజని ఎరువులు నీటిలో త్వరగా కరిగి మొక్కలు తీసుకొనే నత్రజని తక్కువగా వుంది అధిక నత్రజని నేల క్రింది పొరల లోనికి పోవడం (leaching) లేదా నత్రజని ఆవిరి రూపం లో గాలిలో కలిసి పోవడం (volatalization) జరుగుతుంది.
నత్రీకరణ రేటు తగ్గించి, నత్రజని సామర్ద్యాన్ని పెంచుటకు ఈ క్రింది ప్రక్రియలను చేపట్ట వచ్చు. దీని వలన నత్రజని నష్టాన్ని తగ్గించ వచ్చు.

  1. గంధక పూత యూరియా: యూరియా పై గంధకం పూత వలన నత్రజనిని మొక్కలకు కావలసినంత వరకే ఇస్తూ, నష్టాలను తగ్గిస్తాయి.
  2. వేపపిండి, కానుగ పిండి పూత పెట్టిన యూరియా: ప్రతి వంద కిలోల యూరియాకు 20 కిలోల వేపపిండి గాని లేదా కానుగ పిండి తో గాని పూత పెట్టిన యూరియా సామర్ద్యం పెరుగు తుంది.
  3. తారు పూత పెట్టిన యూరియా: తారు కరిగించి తగినంత యూరియా తో కలిపిన వినియోగ సామర్ద్యం పెరువుతుంది.
  4. యూరియా సూపర్ గ్రాన్యూల్స్ (పెద్ద గుళికలు): 1-3 గ్రాముల బరువు గల గుళికలు వాడుక చేయడం ద్వారా నత్రజని సామర్ధ్యాన్ని పెంచవచ్చు.

No comments:

Post a Comment